హైదరాబాద్ : తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలను మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. వాస్తవం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ప్రగతి భవన్లో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు, ఎమ్మెల్యేలను ఒక వైపు కూర్చోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే తాను ఎమ్మెల్యేల వరుసలో కూర్చోవడంతో, మంత్రుల వైపు కూర్చోవాల్సిందిగా సూచించారు.
ఈ విషయం తెలుసుకోకుండా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రికి, దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రీకరించడం సరికాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.
అదేవిధంగా పార్టీ అనేది ఒక కుటుంబం. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి తండ్రి లాంటి వారు. కుటుంబ సభ్యులను సంభోదించినట్టుగానే సంభోదించారు. ఆ పక్కన సహచర మంత్రి హరీష్ రావు నా కోసం పక్కకు జరిగి నాకు కుర్చీ ఇచ్చారు. ఇది కూడా గమనించాలి ప్రతిపక్షాలు. జరిగిన విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికి వారు, వారికి అనుకూలంగా ఉహించుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బురద చల్లే రాజకీయం మానుకోవాలి. లేదంటే అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.