హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): దళిత డిక్లరేషన్తో దళితులను, గిరిజనులను మరోసారి వంచించాలని కాంగ్రెస్ యత్నిస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లో అబద్ధాలు తప్ప మరేమీ లేవని మండిపడ్డారు. అధికారంలో ఉన్నంత కాలం దళితులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఇప్పుడు ఎన్నికలు రాగానే డిక్లరేషన్లు ప్రకటిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నిజంగా దళితులు, గిరిజనులపై ప్రేమే ఉంటే ప్రకటించిన డిక్లరేషన్లోని పథకాలను ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు మాయ మాటలతో, డమ్మీ హామీలతో మభ్య పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని జిమ్మికులు చేసినా తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆరెస్సేనని చెప్పారు.