హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు, అన్ని వర్గాలు ఎలాంటి అభద్రతకు లోనుకాకుండా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని మంత్రి కొప్పుల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 204 గురుకుల పాఠశాలల ద్వారా మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నదని గుర్తు చేశారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు కానుకలు సైతం అందిస్తున్నదన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆసక్తి చూపే యువతకు రూ.20లక్షల వరకు సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం షాది ముభారక్ పథకం ద్వారా రూ.1,1116 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. దీంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని, ఆడపిల్లలు సైతం ఉన్నత విద్యావంతులవుతున్నారన్నారు. బక్రీద్ పండగను కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.