వెల్గటూర్ : జూటామాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని, బొమ్మరిల్లులా నిర్మించుకున్న రాష్ట్రాన్ని పాడు చేసుకోవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) కోరారు. పెద్దపల్లి జిల్లా మంగళవారం ఎండపల్లి మండలంలోని రాజరాంపల్లి గ్రామంలో గుల్లకోట, చెర్లపల్లె గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్( Cheif Minister KCR ) నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ(BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రాన్ని దేశానికి తలమానికగా తయారు చేస్తుంటే గిట్టని కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కాంలేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కులమల్ల లక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సింహాచలం జగన్, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, ఫాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి , ఆలయ కమిటీ చైర్మన్ పదవి నారాయణరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గెల్లుశేఖర్, సర్పంచులు ఉన్నారు .