కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు. శుక్రవారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించారు. జిల్లా కలెక్టర్లకే దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే దళిత బంధు(Dalit bandu) లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సంబంధిత జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ల తో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. దళిత బంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన 17 వందల కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటికే 850 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికీ పథకం వర్తింపజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
స్వరాష్ట్రంలో దళిత, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో సమూలమైన మార్పుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. విద్య, వైద్య పరంగా అట్టడుగు వర్గాల పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి దళిత కుటుంబానికీ పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచడే ఈ పథకం లక్ష్యమన్నారు.
ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.