ధర్మారం (పెద్దపల్లి ) : ఉచిత విద్యుత్ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇస్తుంటే కేవలం 3 గంటల కరెంట్ మాత్రమే సరఫరా సరిపోతుందని వ్యాఖ్యనించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని లంబాడితండా (కే), కొత్తూరు, కొత్తపల్లి గ్రామాల్లోని తండాల్లో జరిగిన శీత్లా భవానీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డికి రైతులపై ఉన్న వ్యతిరేకత, నిజ స్వరూపం బయటపడిందన్నారు. ఆయన వ్యాఖ్యలు రైతులను తీవ్రంగా అవమానానికి గురిచేశాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఇచ్చి రైతులకు మేలు చేస్తుంటే అదిగిట్టని పీసీసీ చీఫ్కు వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంట్ సరఫరా చేస్తే సరిపోతుందని మాట్లాడడం అహంకారానికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో ధరణి విజయవంతంగా అమలవుతుంటే ఆ వ్యవస్థను గంగలో పారేస్తానని ఎద్దేవా చేయడం రేవంత్కే చెల్లిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మరిచిపోయారా అని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పేంతరకు రైతులంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు.