చాదర్ఘాట్, మార్చి 20: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన వారందరికి పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ప్రాంగణంలో క్వాల్కం, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో వయోవృద్ధులకు, దివ్యాంగులకు రూ.160 కోట్ల విలువ చేసే 8 అత్యవసర వాహనాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్న దివ్యాంగులకు రూ.40 లక్షల విలువైన 56 బ్యాటరీతో నడిచే వీల్ చైర్లు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రూ.76 లక్షల విలువైన 150 ల్యాప్ట్యాప్లు, 76 సెల్ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వంతో కలిసి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.కోట్ల విలువ చేసే పరికరాలను అందజేసేందుకు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ.46 కోట్లతో అనేక సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించామని తెలిపారు. అంతకుముందుకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, కార్పొరేషన్ జీఎం ప్రభంజన్రావు, సంక్షేమ శాఖ ఏడీ రాజేందర్, రాజ్గోపాల్, క్వాల్కామ్ సీఈవో నితిన్ శర్మ, నిర్మాణ్ సంస్థ సీఈవో మయూర్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్లో 4 గంటల వరకే విధులు
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్పై పని చేస్తున్న వారు ప్రార్థనలు చేసుకునేందుకు సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోవచ్చని అనుమతించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇదిలా ఉండగా, రంజాన్ ఏర్పాట్లపై మాసబ్ ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో హోంమంత్రి మహమూద్ అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, అధికారులతో ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఉపవాసదీక్షలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.