హైదరాబాద్ : ఎస్సీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. 2020-21 కార్యచరణ ప్రణాళిక అమలు, రూపొందించాల్సిన ప్రణాళికపై మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తి నైపుణ్యంతో సంబంధం లేని రుణాలను, నెలాఖరులోగా ఇవ్వాలని, వృత్యి నైపుణ్యానికి సంబంధించి రుణాలను డిసెంబర్ చివరి నాటికి ఇవ్వాలని సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యచరణ ప్రణాళికలో ఏయే అంశాలను చేర్చాలో ఖరారు చేయాలని, ఈ నెలాఖరులో కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దళితుల సంక్షేమం, ఉన్నతి, రుణ ప్రణాళిక అమలు, ఉపకార వేతనాలు, వసతి గృహాల నిర్వహణ, స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం, వచ్చే బ్యాంకర్ల సమావేశంలో ఎస్సీల సముద్ధరణకు సంబంధించిన అంశాలను చేర్చడం తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గమైన ధర్మపురిలో ఎస్సీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఆయా వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాలను వెంటనే చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహూల్ బొజ్జ, ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండా శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.