హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ మధ్యకాలంలో అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చిందని, ఈ ప్రమాదాల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీసంపద నష్టపోయే అవకాశం ఉన్నందున అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదాల వల్ల పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించే వారు అధికారుల సూచనలు పాటించాలన్నారు. అడవుల్లో వంట చేయడం, సిగరెట్, బీడీ పీకలు పడేయవద్దని సూచించారు. ప్రమాదాల నివారణ కోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.