హైదరాబాద్ : దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల(Martyrs) ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం వారికిచ్చే అసలైన నివాళి అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. అమరవీరుల దినోత్సవం (మహాత్మాగాంధీ వర్ధంతి-జనవరి 30) సందర్భంగా దేశం కోసం పోరాడుతూ అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు.
గాంధీజీ, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో దేశభక్తులు భరతజాతి విముక్తికై తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి, చరిత్రలో అజరామరమైన స్థానాన్ని పొందారని అన్నారు. దేశం పై ప్రేమతో అసమానమైన పోరాట తీరును ప్రదర్శించిన మరెందరో వీరుల తెగువ, పోరాట పటిమ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఎందరో అమరుల త్యాగాలతో మహోన్నత దేశంగా రూపుదిద్దుకున్న భారతదేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడేందుకు దేశ ప్రజలు, యువత పిడికిళ్లు బిగించాలని, అప్పుడే అమరవీరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలే ప్రేరణగా దేశ పురోగమనానికి ప్రజలంతా ఏకమై ఉక్కు సంకల్పంతో ముందుకు సాగినప్పుడే మహోజ్వల భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.