రామగుండం – మణుగూరు కొత్త రైల్వే లైను ప్రతిపాదన 2004 సంవత్సరం నాటిది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.2వేల కోట్లు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ సర్కారుదీ అదే తీరు.
కాజీపేట-విజయవాడ మూడో లైను, విద్యుద్దీకరణ ప్రాజెక్టు. ఇదీ దశాబ్ద కాలంగా ముక్కుతూ మూలుగుతున్నది. దాదాపు 220 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సిన పనులు నేటికి సగం కూడా పూర్తి కాలేదు. ఇవి మచ్చుకు కొన్నే..
Railway projects | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కూట్లో రాయి తీయలేనోళ్లు… ఏట్లో రాయి తీస్తమన్నరట! కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తీరు ఇట్లనే ఉన్నది. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల కోసం ఢిల్లీలో ఎక్కని, దిగని గడప లేదు. కేంద్ర సర్కారులో తెలంగాణ నుంచి మంత్రి కిషన్రెడ్డి సహా నలుగురు ఎంపీలున్నారు. వీళ్లు ఏనాడూ ఒక్క ప్రాజెక్టుకు రూపాయి తెచ్చింది లేదు. కానీ.. ఎన్నికలు వస్తున్నాయనగానే ‘తెలంగాణకు రూ.83,543 కోట్ల రైల్వే ప్రాజెక్టులు’ అంటూ మంత్రి కిషన్రెడ్డి మీడియా ముందుకొచ్చారు. తెలంగాణలో అనేక రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు కొన్ని ఏండ్లుగా సర్వే దశ కూడా దాటక ఆపసోపాలు పడుతుంటే కొత్త ప్రాజెక్టుల జాతర మొదలుపెట్టారు. అసలు వీటికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ వద్ద ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తొమ్మిదేండ్లుగా మొండి చెయ్యే!
తెలంగాణకు భారీ రైల్వే ప్రాజెక్టులు అంటూ మంత్రి కిషన్రెడ్డి కాగితాల కట్టలు మీడియాకు చూపించడం రాష్ట్రంలో విడ్డూరంగా మారింది. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేక.. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ సమయంలో ఎదురుచూడటం.. పెదవి విరవడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారింది. రైల్వే ప్రాజెక్టుల విషయం లో కేంద్రం తెలంగాణకు గత తొమ్మిదిన్నరేండ్లుగా మొండిచెయ్యే చూపుతున్నది. కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 11 ప్రతిపాదనలు పంపింది. కొత్తగా 25 లైన్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరి కొన్ని సంవత్సరాలైతున్నది. వీటి విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉన్నది. బీఆర్ఎస్ ఎంపీలు సహా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సైతం అనేకసార్లు మీడియా ద్వారా కూడా కేంద్రానికి విన్నవించారు. కానీ ఏనాడూ అటు కేంద్రంగానీ ఇటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహా బీజేపీ ఎంపీలు గానీ స్పందించిన దాఖలాలు లేవు.
మెట్రోకు ఇవ్వాల్సిన నిధులేవి?
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రీజనల్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే లైను అంటూ రూ.12వేల కోట్ల ప్రాజెక్టును ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశకు యూపీఏ ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన పది శాతం నిధుల్లో (వీజీఎఫ్-వయబుల్ గ్యాప్ ఫండింగ్) 60-70 శాతం వరకు ఇచ్చింది. కానీ మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. 2015 నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి వీజీఎఫ్ను కూడా ఇవ్వలేదు. రూ. 254 కోట్ల మేర వీజీఎఫ్ రావాలని (పెరిగిన అంచనా వ్యయం మేరకు ఆ మొత్తం సుమారు రూ.720 కోట్లు) తెలంగాణ సర్కారు అనేకసార్లు కేంద్రానికి లేఖ రాసింది. కానీ ఏనాడూ మంత్రి కిషన్రెడ్డిగానీ బీజేపీ నేతలుగానీ ఒక్క రూపాయి నిధుల్ని కూడా ఇప్పించలేదు.
ఇది నిజమేనా?
మంత్రి కిషన్రెడ్డి ప్రకటించిన రూ.83 వేల రైల్వే ప్రాజెక్టుల గురించి తమకు సమాచారమేదీ లేదని రైల్వే అధికారులంటున్నారు. ఎన్నికల వేళ.. నిజంగా కేంద్రం ఇంత భారీ ఎత్తున తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు ఇవ్వాలని నిర్ణయించి ఉంటే! ఆ ప్రకటనను ప్రధాని మోదీ తన నోటితో చేస్తారు తప్ప మంత్రి కిషన్రెడ్డితో ఎలా చేయిస్తారు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. వందే భారత్ రైలు ప్రారంభానికి సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని.. రూ.521 కోట్ల కాజీపేట ఓవర్హాలింగ్ కేంద్రం శంకుస్థాపనలో ఎంతో హంగామా చేసిన మోదీ ఇంత భారీ స్థాయిలో ప్రాజెక్టుల మంజూరు విషయాన్ని ఆయన ప్రకటించకుండా ఉంటా రా? కిషన్రెడ్డి చెప్తున్నది నిజమేనా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.