GHMC | కంటోన్మెంట్, జూలై 28: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని త్వరలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. విలీన ప్రక్రియ వేగవంతమైందని, జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లాంఛనమేనని లోక్సభలో రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ శుక్రవారం తెలిపారు. కంటోన్మెంట్ల విలీనం కసరత్తు ఎంతవరకు వచ్చిందని మంగల్ సురేశ్ అంగడీ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను స్వీకరించామని, కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. విలీనానికి తెలంగాణ, జార్ఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే అంగీకరించాయని తెలిపారు. వీటికి అనుకూలంగా కొంత కసరత్తు జరుగుతున్నదని, త్వరలోనే సమీప మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ ప్రాంతాలను విలీనం చేస్తామని వెల్లడించారు.
కేటీఆర్ పోరాటానికి తలవంచిన కేంద్రం
సైన్యం నియంత్రణలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జనావాసాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు కొన్నేండ్లుగా కేంద్రంతో పోరాడుతున్నారు. కంటోన్మెంట్ వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని కేంద్రానికి అనేకసార్లు విన్నవించారు. దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే విలీనమే శరణ్యమని కేటీఆర్ స్పష్టంచేశారు. దీంతో కేంద్రం కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు అంగీకరించక తప్పలేదు.