హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): మరో ఎన్నికల హామీపై రేవంత్ సర్కారు చేతులెత్తేయబోతున్నదా? రైతు రుణమాఫీని అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంగళవారం గాంధీభవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు అలాంటి అనుమానాలే రేకెత్తిస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినమాట వాస్తవమేనని, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెల్వదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ హామీపై మీడియా ప్రశ్నించగా ‘రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది? అన్నట్టుగా ఉన్నదీ ప్రశ్న. ఎన్నికల ముందు మాట్లాడినం. హామీ ఇచ్చినం. అప్పటికి రూ.2 లక్షల కోట్ల అప్పే ఉన్నదని చెప్తే వాస్తవమే అనుకున్నం. మేం అధికారంలోకి వచ్చాక చూస్తే రూ.8 లక్షల కోట్లు అని తేలింది. దాని వడ్డీ కట్టేందుకే అప్పు తెస్తున్నం. ఏటా 67 వేల కోట్లు కట్టాల్సి వస్తున్నది’ అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి రైతులకు రుణమాఫీ లేనట్టేనా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికే.. నిరుద్యోగ భృతి ఇస్తామని తామెప్పుడన్నాం? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాలుక మడతేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్లో ఆ పార్టీ అగ్ర నేత ప్రియాంకగాంధీ స్వయంగా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తీరా.. అధికారంలోకి వచ్చాక హామీనే ఇవ్వలేదని భట్టి అసెంబ్లీలోనే ప్రకటించి, దానికి మంగళం పాడారు. ఇక, మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో రుణమాఫీకి కూడా మంగళం పాడినట్టేనా? అన్న అనుమానం కలుగుతున్నది.
రైతు సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్టులు, గత ప్రభుత్వ అవినీతిపై చర్చించేందుకు హరీశ్రావు సిద్ధమా? అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. సమయం, తేదీ, వేదిక ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. ‘సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు అంటున్నారు. గత పదేండ్లలో రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ఇప్పుడు చేసేదేం లేక సచివాలయాన్ని ముట్టడిస్తామని అంటున్నారు. వాళ్లు పాత ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారు. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల కోసమే హరీశ్రావు మాట్లాడుతున్నారు. వాళ్ల అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఇవాళ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా?’ అని ప్రశ్నించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. నివేదిక అందగానే రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని వివరించారు. అన్నదాతల కష్టాలు, కడగండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలు ఆగలేదని చెప్పారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపడతామని చెప్పి, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టులే కాదు.. ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ సర్కారు నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.