జోగుళాంబ గద్వాల, డిసెంబర్ 12 : ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) తెలిపారు. జోగుళాంబ గద్వాల ఐడీవోసీ కార్యాలయ సమావేశ హాల్లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో మూడు రైస్ మిల్లుల (Rice mills)కు చెందిన యజమానులు ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని బియ్యం ఇవ్వకుండా సుమారు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతుందని.. వారిపై ఇప్పటివరకు పీడీ యాక్ట్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించారు.
రైస్ మిల్లర్లకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఇచ్చారు.. వారు ఎంత బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారో చెప్పాలన్నారు. ఇందుకుగానూ సంబంధిత శాఖ అధికారి నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, పురోగతి, జూరాల, నెట్టెంపాడ్, ర్యాలంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్లపై ఆరా తీశారు. ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో నివేదిక అందజేయాలని ఆదేశించారు.
ఆబ్కారీశాఖలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. అక్రమ మద్యం, గుడుంబా విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జెడ్పీచైర్పర్సన్ సరిత, కలెక్టర్ వల్లూరు క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.