సూర్యాపేట : ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంశించారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద నుంచే పోరాటం ప్రారంభం అయిందన్నారు. ఆ పోరాటం వెనుక ముఖ్య భూమిక పోషించింది వ్యాపార వర్గాలే ఆన్న నగ్న సత్యాన్ని విస్మరించరానిదన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టా గోష్టిగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. వ్యాపారంతో పాటు సమాజ సేవలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్తక వ్యాపార వర్గాలు నాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం మొదలు, నిన్నటి వేరు తెలంగాణా ఉద్యమాలకు ఊపిరి లుదారని ఆయన గుర్తుచేశారు. మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలభవన్ ఏర్పడింది అంటే అది ముమ్మాటికి వనమా వెంకట్రామయ్య గొప్పతనమేనని ఆయన కొనియాడారు.
అటువంటి వారిని స్మరించుకునేందుకే ఈ నెల 16 న జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన కేసీ గుప్తా విగ్రహం రోడ్ల విస్తరణతో పక్కకు పోయినందున అదే రోజు పునరుద్ధరణ ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీలా మహాదేవ్, మోరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, బండారు రాజా, రాచర్ల కమలాకర్, మీలా వంశీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్, గుండా శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.