నల్గొండ : రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, అభివృద్ధి కోసమైతే అదే పార్టీ నుంచి రాజగోపాల్రెడ్డి ఎందుకు పోటీ చెయ్యడం లేదంటూ మునుగోడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 20 న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాదీవెన సభా ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కర్రావు, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ విప్ కర్నే ప్రభాకర్, క్రీడాభివృద్ధి చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి మంత్రి వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోదీ, అమిత్షా వద్ద తాకట్టు పెట్టాడని విమర్శించారు. రాజకీయాలను వ్యాపారంగా మలచుకోవడం కోమటి బ్రద్స్కు అలవాటేనంటూ ఆరోపించారు. ఎవరు కాంట్రాక్టులు ఇస్తే.. ఆ పార్టీలోకి చేరడం వారికి పరిపాటేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తో వారి కుటుంబం అభివృద్ధి అయ్యిందని, ఆంధ్రా రాజకీయ నేతల వద్ద తెలంగాణా హక్కుల్ని అమ్ముకున్న ప్రబుద్ధులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన విరుచుకుపడ్డారు.
నల్గొండ జిల్లా ప్రజల నీటి వాటాను వైఎస్ దగ్గర అమ్ముకున్న ద్రోహులు కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఖాళీ అయిందనే తెలిసి బీజేపీలోకి వెళ్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ నాడు రాజీనామాలు చేసిందని, రాజీనామా చేసిన వారందరూ తిరిగి టీఆర్ఎస్ నుంచే పోటీ చేశారన్నారు. కాంట్రాక్టుల కోసమే ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నికలు వస్తున్నాయన్నారు. మునుగోడులో బీజేపీది మూడో స్థానమేనన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయాలనుకునే దుర్భుద్దిపరులే వలస వెళ్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.