సూర్యాపేట : ప్రజల బాధను ఏనాడు పట్టించుకున్న పాపాన పోని కాంగ్రెస్ నాయకులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఫ్లోరోసిస్ను పెంచి పోషించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) ఆరోపించారు. ఫ్లోరోసిస్ను అంటగట్టిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) అధికారంలోకి వచ్చాకే ఫ్లోరోసిస్(Fluorosis)ను మటుమాయం చేశారని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మంచి నీటి పండుగ సంబురాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 వేల కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ( Mission Baghiratha) పథకంతో ఇంటింటికి తాగు నీరు సరఫరా అందుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మురికినీరు అందేదని, నీటి కొరత కారణంగా ప్రతిరోజు నల్లాల వద్ద నీటియుద్ధాలు జరిగేవని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యేవని తెలిపారు.
రాష్ట్రంలో జీవనదులు పారుతున్నా సీమాంధ్ర నేతలకు బయపడి తెలంగాణ ప్రజల గొంతులు తడపలేక పోయారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ఏ మోహం పెట్టుకుని యాత్రల పేరిట జనాల వద్దకు వస్తున్నారని దుయ్యబట్టారు. నీటి గోసను తీర్చేందుకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని తెలిపారు. అంతేగాక భగీరథ నీటితో ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేయవచ్చని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ. 5102.39 కోట్లతో 7లక్షల ఇళ్లకు తాగు నీటి సరఫరా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జలసాధన ఉద్యమ నేత దుశ్చర్ల సత్యనారాయణ, మిషన్ భగీరథ అధికారి సురేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.