యాదాద్రి భువనగిరి : ప్రాధాని మోదీ, అమిత్ షాల దుష్ట ద్వయం తోటే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చి పడిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హస్తినకు వచ్చి దేశరాజకీయాలను శాసిస్తారన్న భయం తోటే వారు ఇలాంటి కుట్రలకు తెర లేపారని ఆయన ఆరోపించారు.
నారాయణ పురం మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. తెలంగాణా ప్రజల ఆశీర్వాదమే సీఎం కేసీఆర్ బలమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణా పెట్టింది పేరు అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆత్మీయ సమ్మేళనాలు, వన భోజనాలు ఆ సంస్కృతిలో భాగామేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పై పోరుకు మునుగోడులో 70 వేల మంది గులాబీ దండు సన్నద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడ కాషాయం కుట్రలకు తావు లేదని ఆయన తేల్చిచెప్పారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు కిశోర్ కుమార్, లింగయ్య, సైదిరెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.