సూర్యాపేట : రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ( Minister Jagdish Reddy ) మండిపడ్డారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) వరదలపై గవర్నర్ (Governor ) ను కలవడాన్ని తప్పుబట్టారు.
కేంద్రం నుంచి సహాయం తీసుకురాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించారు. బీజేపీ కి తోక పార్టీ అనేది నిజమనేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. బీజేపీ( BJP ) నాయకురాలిగా ప్రవర్తిస్తున్న గవర్నర్ను వరదల (Floods) సందర్శనకు రమ్మనడం కాంగ్రెస్ దివాలకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కి ప్రత్యామ్నాయం అయితే మోదీ పెట్టిన గవర్నర్ను కలవడంలో అంతరార్ధం ఏమిటని ప్రశ్నించారు.
వారం రోజుల పాటు కురిసిన వర్షాలపై అనునిత్యం సీఎం కేసీఆర్( CM KCR ) సమీక్షించారని వెల్లడించారు. ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రావొద్దని చేసిన ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థతో పాటు ఆయా శాఖలు సమర్ధవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా ముందే వరద నివారణ చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. వరుసగా నాలుగేండ్ల నుంచి వరదలు వస్తున్నా కేంద్రం పై ఒక్క మాట మాట్లాడకుండా బీజేపీ పట్ల భక్తిని చాటుతూ బీజేపీ ఏజెంట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.
గుజరాత్ లో రాని వరదలకు నిధులు ఇచ్చే కేంద్రం తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడంలేదని అన్నారు. వరుస వరదల పై మూడు సార్లు కేంద్ర బృందాలు వచ్చి పరిశీలించినా పైసా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. వీటిపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడకుండా కేసీఆర్ పై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు.