Minister Jagadish Reddy | తెలంగాణలో రైతే రాజని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో రైతుసేవా కేంద్రం భవనానికి, గోడౌన్ నిర్మాణానికి మంత్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పరమేశ్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని అన్నారు. వ్యవసాయం చేస్తున్న అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుంచి కాలర్ ఎగరేసి మేం చేస్తున్నది వ్యవసాయం అని చెప్పుకుని మురిసె వాతావరణం నెలకొందన్నారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలే దోహదపడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడితో రికార్డ్ సృష్టించిందన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతం నుంచి కేవలం 40లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికే పరిమితం కాగా.. ఇప్పుడు కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో తెలియని వెలితి ఉందన్నారు. కష్టానికి, పెట్టుబడికి సరిపడా రైతు దిగుబడి సాధించలేకపోతున్న బాధ ముఖ్యమంత్రి కేసీఆర్ను వెంటాడుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపినప్పుడు మాత్రమే ఎకరాకు మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు.
కూరగాయల మొదలు అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నప్పటికీ మూస పద్ధతిలో వ్యవసాయానికి రైతు అలవాటు పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పడితే రైతును రాజును చేయొచ్చన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే నెరవేరిందని, అదే రైతు మరింత సుసంపన్నం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అని మంత్రి తెలిపారు. సమైక్యాంధ్ర పాలనలో సాగర్ ఎడమ కాలువ కింద భూములకు వరుసగా మూడు మార్లు నీళ్లు విడుదల చెయ్యలేని దుస్థితి నుంచి తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 16వ మారు నీటిని విడుదల చేసుకున్నాం అంటే ముమ్మాటికి అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతనేనని కొనియాడారు.
రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని మరింత పురోగతిని సాధించేందుకే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతుబందు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ పేరు ప్రపంచ చిత్రపటంలో మారుమోగుతుందన్నారు. అందుకే వలసలకు కేరాఫ్గా నిలిచిన మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపస్ రావడమే కాకుండా దేశం నలుమూలల నుంచి తెలంగాణకు వలసల ప్రవాహం జోరందుకుందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో వరి నాట్ల కోసం సరిహద్దున కర్నాటక తో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలో రూ.1.56కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి శంకుస్థాపన మంత్రి శంకుస్థాపన చేశారు.