వెంగళరావునగర్, సెప్టెంబర్ 15: తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుంటే, బీజేపీ రాష్ర్టాల్లో విద్యుత్తు రంగం సంక్షోభంలో కూరుకున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఎర్రగడ్డ జీటీఎస్ కాలనీలోని తెలంగాణ జెన్కో ఆడిటోరియంలో ఇంజినీర్స్డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమైనదని ప్రశంసించారు.
రాష్ట్ర విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, కోతలు లేని నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని వివరించారు. బీజేపీ రాష్ర్టాల్లో రాత్రిళ్లు కరెంటు వాడొద్దని, ఏసీలు వాడొద్దని ఆంక్షలు విధిస్తున్నారని, అదనపు సర్చార్జ్లను విధిస్తున్నారని దుయ్యబట్టారు. పరిపాలనా దక్షత, ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, విద్యుత్తు రంగం విజయాలకు ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఇంజినీర్లకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ ఎండీ రఘురామిరెడ్డి, విద్యుత్తు రంగ సంస్థల డైరెక్టర్లు, తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి సదానందం తదితరులు పాల్గొన్నారు.