Minister Jagadish Reddy | దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల, పెన్ పహాడ్ మండలం దూపహడ్ గ్రామాల్లో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయా ఆలయాల్లో మంత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే బొడ్రాయి పండుగ చేస్తారని, ఊరిలోని వారంతా కలిసి ఐకమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యమన్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనమని, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతీ ఒక్కరూ తమతమ ఆచారాలకు అనుగుణంగా దైవచింతనను కలిగి ఉండాలని, తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని, గ్రామ ప్రజలందరికీ బొడ్రాయి, సీతారామ చంద్రస్వామి సహిత దుర్గామహేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యం ఆయురారోగ్యాలతో పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరారు.
రెండు గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా వేలాది మంది భక్తులకు మంత్రి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి చందుపట్లలో స్వయంగా భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సుదీర్రావ్, రౌతు నర్సింహరావ్, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దింగరి యుగంధర్, దూపహడ్ సర్పంచ్ బిట్టుర్ నాగేశ్వర రావు, సర్పంచులు చెన్నుట్ శ్రీనివాస్ రెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.