సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గత పాలకుల హయాంలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలోనే అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్లో నిర్మించిన దండు మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, మంత్రి ఆలయంలో గణపతి హోమం నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఆలయాల నిర్మాణంతో పాటు దీప ధూప నైవేద్యాలతో అర్చకులకు ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు యంత్ర పూజలు, హోమాలు జరుగనున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలి రానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
దండుమైసమ్మ తల్లి దీవెనలు ప్రజలపై, ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ మర్ల చంద్రా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కోనతం సత్య నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహ రావ్, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, ఆలయ చైర్మన్ బెల్లం కొండ యాదగిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.