Jagadish reddy | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ ఆ రోజు జలదృశ్యం లో చెప్పిందే నేడు జరిగింది. మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. దేశం మొత్తం తెలంగాణతరహా పాలన కోరుకొంటున్నది.
తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల ప్రజలు సైతం మన పథకాలు కావాలని కోరడం.. మన నాయకుడి సమర్థ పాలనకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. దేశం యావత్తు తెలంగాణ మాడల్ కోరుకొంటున్నదని చెప్పారు. దీంతో కేంద్రంలోని బీజేపీతోపాటు మోదీ, షా ద్వయానికి భయం పట్టుకొన్నదని అన్నారు. దేశానికి పట్టిన ఈ దారిద్య్రాన్ని పారదోలాలంటే కేసీఆర్లాంటి సమర్థుడు దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు.