సూర్యాపేట, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొమ్మిదేండ్లుగా ఎవరూ ఊహించని రీతిలో సాగిస్తున్న నిరంతర అభివృద్ధి, పాలన తీరు యావత్తు ప్రపంచానికే సరికొత్త పాఠం నేర్పుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎట్లుండే.. స్వరాష్ట్రంలో అనతికాలంలోనే ఎంత అభివృద్ధి చెందింది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగించారు. నాడు అన్ని విధాలుగా వెనుకబడిన తెలంగాణను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రగతిబాట పట్టించారని, యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాలు కోరుకుంటున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రగతి కోసం జిల్లాకు వచ్చినప్పుడల్లా వరాల జల్లులు కురిపించి ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకొన్నారని కొనియాడారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు రావడంతో ఫ్లోరైడ్ భూతం తరలిపోయిందని, నేడు ప్రాజెక్టుల నుంచి నీళ్లు గలగలా పారుతుండటంతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి విపక్షాలు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకొంటున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకుండా వేసిన కేసులు అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. సూర్యాపేటను సర్వనాశనం చేసిన నాయకులు పట్టణ అభివృద్ధిని సహించక అర్థంలేని కేసులతో అభివృద్ధిని ఆలస్యం చేశారని విమర్శించారు. అయినా అభివృద్ధి మాత్రమే గెలుస్తుందనే ధీమాతో ఓపిక పట్టి కేసులను అధిగమిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు తరలివచ్చిన ప్రజలకు మంత్రి జగదీశ్రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.