హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పనులు చేసే ప్రధాని కాదని, పన్నులు వేసే ప్రధాని అని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి జీ జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తల్లిపాలపై మినహా అన్నింటిపై పన్నులు వేయటమే పనిగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ, సీసీఐ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశమంతా ఆసక్తి నెలకొన్నదని, దేశానికి తెలంగాణ మాడల్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకొంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 8 ఏండ్ల పాలనలో దేశానికి చేసిన ఒక్క మంచిపని కూడా లేదని మండిపడ్డారు. పన్నుల రూపంలో ప్రజల జేబు కొట్టిన దుర్మార్గ పాలన మోదీదని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిన చరిత్ర అని ఎద్దేవా చేశారు.
మునుగోడు ప్రజలకు అండగా ఉంటాం
ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే (కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి) కు వ్యాపారాలు, కాంట్రాక్టులపై ఉన్న ప్రేమ ప్రజాసేవ మీద లేదని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సొంత పనులను చూసుకోవటంలో తలమునకలైన ఎమ్మెల్యే, నియోజకవర్గానికి రావటమే మానేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు ప్రజల కష్టాలు తీరుస్తామని, పార్టీలో చేరినవారిని కడుపులో పెట్టుకొని చూసుకొంటామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి కేక్ కట్ చేశారు.
టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
మెండోరా/మహబూబ్నగర్/మల్యాల, జూలై 24 : కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం పలు జిల్లాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర పార్టీలకు చెందిన వారు భారీగా గులాబీ కండువా కప్పుకొన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ (ఎస్సారెస్పీ) గ్రామంలోని జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి చెందిన సివిల్ విభాగం కార్మికులు 11 మంది టీఆర్ఎస్వీకేఎస్లో, మెండోరా మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులతోపాటు మరో 45 మంది కాంగ్రెస్ యూత్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. కాగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీలకు చెందిన వారు మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. టీడీపీ నుంచి మాజీ కౌన్సిలర్ యాదయ్య, గోనెల అశోక్, గోనెల బాల్నాగయ్యతోపాటు సుమారు 100 మంది, షాషాబ్గుట్టకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో 100 మంది, మదీన మజీద్కు సంబంధించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ కలీమొద్దీన్ ఆధ్వర్యంలో 200 మంది, ఎంఐఎం నాయకులు వాజీద్ ఆధ్వర్యంలో 300 మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మానాల, లంబాడిపల్లి, తక్కళ్లపల్లికి చెందిన 40 మంది బీజేపీ కార్యకర్తలు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.