Minister Jagadish Reddy | గుజరాత్లో రూ.2వేల పెన్షన్ ఇవ్వలేని మోదీ.. తెలంగాణను ఉద్దరిస్తాడా? అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చారో.. అధికారంలోకి వచ్చాక అమలు చేశారన్నారు. వేరే జెండాలు ఎజెండాలు ఏ గ్రామానికి వచ్చినా ప్రజలు తిరస్కరించాలన్నారు.
ప్రధాని సొంత రాష్ట్రంలో రూ.600 పెన్షన్ ఇస్తున్నారని, తెలంగాణలో దివ్యాంగులకు రూ.3,016, వృద్ధులకు రూ.2,016 ఇస్తున్నారన్నారు. గుజరాత్లో కేవలం రైతులకు ఆరు గంటల కరెంట ఇస్తున్నారని, దానికి సైతం మీటర్లు పెట్టి వేలకు వేలు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు లేక సగం మంది రైతులు వ్యవసాయాన్ని బంద్ చేశారన్నారు. మోదీ పన్నుల రూపంలో ప్రజలందరి జేబులు కొడుతున్నారని, వంటగ్యాస్ దగ్గర నుంచి పెట్రోల్, టోల్గేట్ చార్జీల పన్నులు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడమే నల్గొండలో సాధ్యమయ్యేది కాదన్నారు. భారతదేశంలో అత్యధిక ధాన్యం పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా చరిత్ర సృష్టించిందని, 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారన్నారు.
కేసీఆర్ చేసిన కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు. భారతదేశానికి నల్గొండ జిల్లా అన్నపూర్ణంగా మారిందని, మోదీ పేదల పొట్ట కొడుతూ ఇద్దరు కార్పొరేట్ పెట్టుబడిదారులను పోషిస్తున్నారన్నారు. మోదీకి ఎదురు మాట్లాడే వారిని జైలుకు పంపిస్తున్నారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటికి నెట్టివేస్తే అడిగే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఈ రోజు దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోందని, పక్క రాష్ట్రాలైన, కర్ణాటక ,మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.