సూర్యాపేట: హుస్సేన్సాగర్ ఒడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బాబాసాహెబ్ పేరుపెట్టడం చరిత్రాత్మకమని అభివర్ణించారు. సూర్యపేటలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దళితుల్లో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దళితబంధు (Dalitha bandhu) పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. గిరిజన తాండలను గ్రామపంచాయతీలుగా రూపొందించడం ద్వారా గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు.
కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా బలపడటం మహిళల చేతుల్లోనే ఉందని గట్టిగ విశ్వసించే వారిలో సీఎం కేసీఆర్ ముందుంటారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అందుకే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. వడ్డీ లేని రుణాలు, ఒంటరి మహిళలకు పింఛన్లు, ఆరోగ్య పరిరక్షణకు న్యూట్రీషన్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మవడి వంటి అద్భుతమైన పధకాలను రూపిందించిన మహానేత సీఎం కేసీఆర్ అని వెల్లడించారు. మహిళల భద్రతకై షీ టీమ్స్, మహిళల కష్టాలను రూపు మాపేందుకు మిషన్ భగీరథ వంటి విప్లవాత్మకమైన పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.
అసలు అభివృద్ధి, సంక్షేమం అంటేనే 2014కు ముందు ఆ తరువాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన వ్యవసాయ విప్లవం యావత్ భారతదేశంలోనే పెను రికార్డులను సృష్టిస్తుందన్నారు. 2014కుముందు తెలంగాణ ప్రాంతంలో 60 లక్షల ఎకరాలు మాత్రమే సేద్యానికి నోచుకోగా 2020-21 నాటికి కోటి 35 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. వ్యవసాయంలో 117% విజయాలను నమోదు చేసుకున్న తెలంగాణలో 2014కు పూర్వం కేవలం 25 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా, నేడు పంజాబ్ రాష్ట్రాన్ని మించి పోయేలా మూడు కోట్ల టన్నులకు ఉత్పత్తికి పెరిగిందన్నారు. గత ఎనిమిదేండ్లుగా వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.45 లక్షల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ.1.61 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, రూ.1.27 లక్షల కోట్లు పంట కొనుగోళ్లకు, రూ.59 వేల కోట్లు ఉచిత విద్యుత్కు, రూ.67 వేల కోట్లు రైతుబంధు పథకానికి, రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ పథకానికి ఖర్చు చేసిన రైతు బాంధావుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
పల్లె ప్రగతి-పట్టణ ప్రగతితో వైకుంఠదామలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పక్కారోడ్లతో పాటు ట్రాక్టర్, ట్రాలీని ఏర్పాటు చేసుకుని ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఘనతకెక్కారని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ యావత్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. వైద్య కళాశాలలను పెంచడంతో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం సామాన్యుడికి అందుతుందని చెప్పారు. మైనార్టీల జీవితాల్లో ముందెన్నడూ లేని ఆత్మస్థైర్యం తెలంగాణ ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే పెరిగిందన్నారు. బడుగుల సంక్షేమానికి భరోసా అందించడమే కాకుండా వారిని సుసంపన్నం చేసేందుకు చేపట్టిన పథకాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాయన్నారు.