సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును (Saddula Cheruvu) అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) తెలిపారు. దీనికిగాను ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు రూపు దిద్దుకుంటున్నాయని వెల్లడించారు. గురువారం ఉదయం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్తో కలసి ఆయన సద్దుల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మినీ ట్యాంక్బండ్లో (Mini Tankbund) పర్యాటకుల విహారం కోసం త్వరలో బోట్ షికారును ప్రారంభించనున్నామని చెప్పారు. ఇప్పటికే టూరిజం బోట్లు పట్టణానికి చేరుకున్నాయన్నారు.
సద్దుల చెరువు మధ్యలో పుట్టిన రోజు, పెండ్లిరోజు వంటి శుభకార్యాలు జరుపుకోవడానికి మినీకృయిజ్ షిప్, ఫైబర్ జెట్లను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. వాకర్స్ కోసం మెడిటేషన్ కేంద్రంతోపాటు ఓపెన్ జిమ్ ఏర్పాచేస్తామన్నారు. చిన్నారుల కోసం సృజనాత్మకతకు అద్దంపట్టే రీతిలో క్రీడా కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయికనుగుణంగా నిర్మాణాలతో పాటు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ముఖద్వార నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు.