సూర్యాపేట : మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహనే కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి..జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్లతో కలిసి గిదర్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి హితమే పండగల పరమార్థం అన్నారు.
పండగలతో సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిదేనని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉందన్నారు. పండుగుల వెనుకున్న లక్ష్యం కూడా అదే అని మంత్రి పేర్కొన్నారు. కావున వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిచ్చి భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు, వాతావరణం ను అందిద్దాం అని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, డీఎస్పీ నాగభూషణం, చివ్వెంల జడ్పీటీసీ సంజీవ నాయక్, శ్రీనివాస్ గౌడ్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీని జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు, పీసీబీ ఈ.ఈ సురేష్ బాబు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 2 వేల విగ్రహాలు చిన్నవి, 125 పెద్ద విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.