Minister Jagadish Reddy | నల్లగొండ : మునుగోడు( Munugode ) నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటి పారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన భూసేకరణలో అలసత్వం చూపొద్దని ఆయన అధికారులకు సూచించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల శాఖ చేపట్టిన శివన్న గూడెం, లక్ష్మణపురం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, శశిలేటి వాగు ఫిడర్ చానల్కు సంబంధించిన భూసేకరణ, నిర్మాణపు పనులు, వెలిమకన్నే, బెందలమ్మ చెరువు, సోలిపురం బ్రిడ్జి, చెక్ డ్యామ్లు, చౌటుప్పల్లోని మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని తన ఛాంబర్లో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. శివన్న గూడెం, లక్ష్మణపురం ప్రాజెక్టుల నిర్వాసితులకు తక్షణమే ప్లాట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పేపర్ వర్క్ను వేగవంతం చేయాలని చెప్పారు. అదే విధంగా శశిలేటి వాగు ఫిడర్కు సంబంధించిన పనులను వేగవంతం చేయడంతో పాటు అందుకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సోలిపురం బ్రిడ్జి నిర్మాణపు పనులను ప్రారంభించడంతో పాటు పెండింగ్లో ఉన్న చౌటుప్పల్ మినీ ట్యాంక్బండ్ నిర్మాణపు పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మినీ ట్యాంక్బండ్ నిర్మాణపు పనులు చేపట్టి పూర్తి చేయలేకపోయిన కారణంగా సదరు కాంట్రాక్టర్కు నోటీస్ ఇచ్చి పక్కకు తప్పించి మరొకరితో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్, ఈఈ రాములు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి ప్రభు కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.