Minister Jagadish Reddy | సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, వెంకటరెడ్డితో కలిసి జిల్లా యంత్రాంగంతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలుపడుతున్నందున ఆ దిశగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో శిథిలా భవనాలు, పాఠశాలను ఇప్పటికే గుర్తించామని ప్రజలను, విద్యార్థులను భవనాల వద్దకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కాజ్వేల వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంటున్నందున బారికేట్స్ ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మట్టితో నిర్మించిన పాత ఇండ్లు ఉన్నాయని, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిపోయాయని, ఆయా కుటుంబాలను పక్క భవనాల్లోకి తరలించాలని మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. విద్యుత్ వినియోగం విషయంలో తప్పనిసరిగా అవగాహన కల్పించాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ కేబుల్స్ను ముట్టుకోవద్దని సూచించారు. చెరువులు నిండితే నీటిని దిగువకు వదలాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. విద్యుత్, ఇరిగేషన్,రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్యశాఖలు నిబద్ధతతో కలసి పని చేయాలని సూచించారు.