హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మునుగోడులో జరుగుతున్నది ధర్మయుద్ధమని.. ఆ యుద్ధంలో టీఆర్ఎస్ గెలుస్తుందని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ నేత ఈటల పలివెల ఘటనను సానుభూతి కోసం వాడుకొంటున్నారని విమర్శించారు. దేశంలో దాడులు చేసే సంస్కృతి బీజేపీదేనని.. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలో జరిగిన ఏ ఎన్నికలోనూ ఘర్షణలు జరుగలేదని గుర్తుచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, టీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, లింగంపల్లి కిషన్రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈటల కౌరవుల పంచన చేరి.. ధర్మయుద్ధం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొంటూ.. రాష్ట్రంపై అక్కసు కక్కుతున్న బీజేపీలో చేరి వాళ్ల చిలుకపలుకులను ఈటల పలుకుతున్నారన్నారు. పలివెలకు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ గూండాలే టీఆర్ఎస్ నేతలపై ముందు దాడులు చేశారని.. వాళ్లు రాళ్లు వేయడంతో తలలు పగిలాయని వివరించారు.
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆయనపైనా దాడి చేశారని చెప్పారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిపైనా దాడి చేశారని.. వీటన్నింటి వీడియోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మునుగోడులో గెలువలేమని తెలిసి ఈటల సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. దాడికి సంబంధించిన ఫొటోలను మంత్రి మీడియాకు విడుదలచేశారు. ఈటల పీఏ నరేశ్.. పోలీసుల ముందే రాయి విసురుతున్న చిత్రాన్ని చూపించారు. సాక్ష్యం ఇంత స్పష్టంగా కనపడుతుంటే.. బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారని మం డిపడ్డారు. తెలంగాణలో గన్లతో ఎవరూ ఏమీ చేయలేరని, దాడులు.. సోదాలు తమ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీయలేవని చెప్పారు.
తన పీఏపై సోదాలు జరుగలేదని. అనుచరుడిపై సోదాలు జరిగాయన్నారు. కేసీఆర్పై ఉపయోగించకూడని భాషను ఉపయోగిస్తూ వ్యక్తిగతంగా అవమానించే పద్ధతుల్లో వారి స్థాయిని మించి మాట్లాడుతున్న బీజేపీ నేతలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాను గెలవలేక దింపుడు కళ్లం ఆశలతో రాజగోపాల్రెడ్డి ధర్నా పేరుతో పోలీసులతో బలవంతంగా అరెస్టు చేపించుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని, రాజగోపాల్రెడ్డి ట్రాప్లో టీఆర్ఎస్ కార్యకర్తలు పడకుండా సంయమనంతో ఉండాలని కోరారు. మునుగోడులో తమ పార్టీకి పూర్తి బలం, బలగం ఉందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు.
కేంద్రం నుంచి 33వేల కోట్లు రావాలి
జడ్పీటీసీ, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు ఆగటానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్రం నుంచి రూ.33 వేల కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమిటి? చేసిందేమిటని ప్రశ్నించారు. మనుషులను మాయం చేసే పార్టీ బీజేపీ అని చెప్పారు. బీజేపీ నాయకులకు పెద్ద పెద్ద నేతలైన సుబ్రమణ్యస్వామి, ప్రవీణ్భాయ్ తొగాడియా లాంటి వారే భయపడుతున్నారన్నారు. తాము కూడా ఏ క్షణం మాయమైపోతామేమోనని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తాము మునుగోడులో ఎవ్వరినీ అడ్డుకోలేదని.. ప్రజలే బీజేపీ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను నిలదీశారని తెలిపారు. కేంద్ర బలగాలు ఉన్నాయి కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
హింస సరైన విధానం కాదు
హింస ఎప్పుడూ సరైన విధానం కాదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణ జరుగనివ్వవద్దని సీఎం కేసీఆర్ సూచించేవారని గుర్తుచేశారు. శాంతియుతంగా ఉన్నప్పుడే ఎక్కడైనా అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లనే పరిశ్రమలు రావడం, స్థిరాస్థుల విలువ పెరగటం చూస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో గతంలో ఏ ఎన్నిక వచ్చినా.. వందల కొద్దీ కేసులు నమోదయ్యేవని.. టీఆర్ఎస్ వచ్చిన తరువాత ఏ ఒక్క ఎన్నికలో కూడా ఘర్షణ చోటుచేసుకోలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్నడూ పోలీసులను వాడుకోదనే విషయం ఈటలకు కూడా బాగా తెలుసని.. రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా పోలీసులను వాడుకోలేదని చెప్పారు. ఇష్టమైన పోలీసులకు పోస్టింగ్లు ఇవ్వడం ద్వారా ఓట్లు రావని.. ప్రజలతో మంచిగా ఉన్నప్పుడే ఓట్లు వస్తాయని సీఎం కేసీఆర్ అనేకమార్లు తమకు చెప్పారన్నారు. ఓటమికి సాకులు వెతుక్కోవడంలో భాగంగానే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని తెలిపారు.