సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్ది అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఐటీ హబ్ ఏర్పాటుకు మూలం కేసీఆర్, కేటీఆరే కారణమన్నారు. సూర్యాపేటలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్కు గాను టాస్క్ ఆధ్వర్యంలో ఐటీ కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యువతను ఎంకరేజ్ చేశారు.
ఉద్యమ సమయంలో చేసిన ఉపన్యాసాలు నేడు నిజం అయ్యాయని, 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ విజన్ దేశానికే రోల్ మోడల్ అన్నారు. ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగల విజ్ఞానం, పరిపాలన దక్షిత కేటీఆర్ సొంతం అన్నారు.
ఇంటి దగ్గరే ఉండి ఐటీ ఉద్యోగం చేసుకునే అవకాశం సూర్యాపేట యువతకు దక్కబోతుందని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని యువత కోసమే ఐటీ హబ్ ను విస్తరించడానికి కారణమన్నారు. ఈరోజు జాబ్ మేళాకు వచ్చిన విశేషం విశేష స్పందన దృష్ట్యా మరోసారి జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.