సూర్యాపేట: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే (Telangana) సొంతమన్నారు. బోనాల (Bonalu) సమయంలో అమ్మవార్లు తమ పుట్టింటికి వస్తారని ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. సూర్యాపేటలో (Suryapet) బోనాల జాతర సందర్భంగా తాళ్లగడ్డలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ముత్యాలమ్మ ఆశీస్సులతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తాళ్లగడ్డ నేడు బంగారు గడ్డగా మారిందన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు.
అభివృద్ధి, వ్యాపారరంగాల్లో సూర్యాపేట దూసుకుపోతున్నదని వెల్లడించారు. ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి పాడి పంటల తో తులతూగేలా చల్లని ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని మరోసారి దీవించేలా అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, చిరివెళ్ల శభరి, బైరు వెంకన్న గౌడ్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.