Minister Jagadish Reddy | చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్కు మగ్గాల చప్పుడే.. కాదు నేతన్నల గుండె చప్పుడు బాగా తెలుసునని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భూదాన్ పోచంపల్లిలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్తో కలిసి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమానికి భోనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ నేతన్నల గుండె చప్పుడు తెలిసినందునే ఉద్యమ కాలంలోనే.. ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు భూదాన్ పోచంపల్లి, సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆదరణ, గుర్తింపు లేక పోవడంతో ఆత్మాభిమానంతో అప్పులు చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కలత చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ నాయకుడిగా జోలె పట్టుకుని వసూలు చేసిన మొత్తంలో చేనేత కార్మికులకు అండగా నిలిచిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు.
అందుకే అధికారంలోకి వచ్చిందే తడువుగా సమస్యను సత్వరమే అర్థం చేసుకోగలిగిన కేటీఆర్ను చేనేత జౌళీశాఖ మంత్రిగా నియమించారన్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎటు చూసినా కనిపించేది చేనేత కార్మికులేనని, ఈనాడు చేనేతలు ఇంతటి పురోగతి సాధించారన్నారు. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆయన మద్దతుతో కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ -1, 2 ప్రభుత్వాలు చేనేత కార్మికులను వారి ఆత్మాభిమానాలను గుర్తించ లేక పోయారని మంత్రి దుయ్యబట్టారు.