హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పవర్ హాలిడేలు ప్రకటిస్తారు.. గడిచిన 20 ఏండ్లుగా అక్కడ బీజేపీయే అధికారంలో ఉన్నా ఇప్పటికీ విద్యుత్ కోతలు సర్వసాధారణం అని తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ట్రాన్స్కో ఆడిటోరియంలో శనివారం జరిగిన దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో కొత్తగా నియమితులైన 1,362 మంది జేఎల్ఎంలకు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డితో కలిసి నియామకపత్రాలను అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధమైన చర్యలతో రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సంస్థలో 35,729 మంది జేఎల్ఎంను నియమించామని వివరించారు. సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ నూతన జేఎల్ఎంలు కష్టపడి పనిచేసి సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు.