హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన సీపీఐ, సీపీఎం నేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెళ్లారు.
టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సీపీఐ, సీపీఎం నేతలు కృషి చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సాఫీగా పాలన సాగుతుంటే ఉప ఎన్నికతో అలజడి సృష్టించారు. కమ్యూనిస్టు నేతల సహకారంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. భవిష్యత్లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తాం. – మంత్రి జగదీశ్ రెడ్డి
రాష్ట్రాన్ని పెద్ద విపత్తు నుంచి కాపాడామని సంతోషంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తుంది. బీజేపీకి అసలు తెలంగాణలో బలం లేదు. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
సీపీఎం, సీపీఐ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. నా విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి