సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట డిపోలో శుక్రవారం ఆర్టీసీ (RTC) కార్మికులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపో ఆవరణ లో విశ్రాంత ఉద్యోగుల కోసం నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులను ఉద్యోగస్తులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ (CM KCR ) కు మాత్రమే దక్కుతుందని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత కేసీఆర్ తోనే ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలు నెరవేరనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కష్ట, నష్టాలు తెలిసిన కార్మిక పక్షపాతి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు (Private) పరం చేసేందుకు చంద్రబాబు (Chandra Babu) , ప్రపంచ బ్యాంక్(World Bank) షరతు లకు భయపడి నోరు మెదపని కాంగ్రెస్ (Congress) ప్రయత్నాలను అడ్డుకుంది కేసీఆర్ యేనని వెల్లడించారు.
నరేంద్ర మోదీ (Narendra Modi ) పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ఎల్ఐసీ (LIC) , విద్యుత్ రంగాన్ని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరానికి బీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేసీఆర్ కు అండగా నిలువాలని ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులు, సిబ్బందికి పిలుపునిచ్చారు.