హైదరాబాద్: పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ (T-diagnostics) అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. వైద్యరంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో టీ-డయాగ్నస్టిక్ హబ్ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్యరంగంలో తెలంగాణ (Telangana) నెంబర్ వన్గా నిలిచిందన్నారు. చిన్నచిన్న పరీక్షలకు సైతం పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల్లో ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన టీ-డయాగ్నస్టిక్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కేంద్రాలలో 134 వైద్యపరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇటీవల కాలంలో మహిళలు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల వంటి బారిన పడుతుండటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, క్యాన్సర్లను ముందుగా గుర్తించే మమోగ్రఫీ టెస్టులను కూడా తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఏ చిన్న అనుమానం వచ్చిన మహిళలు ఆశా వర్కర్లను సంప్రదించి మమోగ్రఫీ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలని విజ్ఞప్తిచేశారు. పల్లె దవఖాన, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు తెలంగాణ డయాగ్నిసిక్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తిచేశారు.