సూర్యాపేట : దేశ రక్షణలో మిలటరీ పాత్ర అమోఘమని, వారు సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోనే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలాంటి వృత్తిని ఎంచుకుని దేశరక్షణలో ముందుండి పోరాడిన గోపయ్య చారి, కల్నల్ సంతోష్ బాబు అమరత్వం అజరమారమని ఆయన కొనియాడారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం డీ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి పవన్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు.
దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సూర్యాపేట ఎస్వీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మిలటరీని వృత్తిని ఎంచుకున్న యువత వర్తమానానికి స్ఫూర్తినందించే విదంగా ఉండాలన్నారు. డీ కొత్తపల్లికి చెందిన పవన్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. సరిహద్దుల్లో విదేశీ చొరబాట్లను నిర్ద్వంద్వంగా నిరోదించేది సైన్యమేనన్నారు.
అలాంటి వృత్తిలో రాణిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడం అనిర్వచనీయమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. మిలటరీలో చేరిన వారికి సహజంగానే ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న సంకల్పం ఉంటుందని, ఆ సంకల్పానికి తగినట్లుగానే అవకాశాలు ఉంటాయన్నారు. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకున్నవారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సభ అనంతరం లెఫ్టినెంట్ ఇమ్మడి పవన్ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.