సూర్యాపేట : ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నమని పేర్కొన్నారు. జిల్లా కోదాడ లోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో వెనుకబడిన కులాలు,కులవృత్తులకు రూ.లక్ష పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
నియోజకవర్గంలోని 294 మంది లబ్ధిదారులకు లక్ష చొప్పున రూ 2.94 కోట్ల చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా కూడా బీసీల కోసం ఇలాంటి పథకం లేదన్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనంది స్తున్నారని తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 300 మందికి లక్ష రూపాయాల చొప్పున సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తుల వారి అభ్యున్నతికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.
కోదాడలో జరుగుతున్న అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే ఇక్కడి ప్రజలు గులాబీ జెండాకు, ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.