Minister Jagadish Reddy | అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు మంత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పండుగ సందర్భంగా నిరుపేదలకు ప్రభుత్వం తరఫున కానుకలు అందిస్తుందని తెలిపారు. పండుగలు సంతోషంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకునేవన్నారు.
అయితే, పండుగల వేళ నిరుపేదలు నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండగ వేళ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ఇచ్చే రంజాన్ తోఫాను ప్రతీ ఒక్కరికీ అందించాలని , ఆ బాధ్యత ఆయా మజీద్ లకు చెందిన మత పెద్దలదేనన్నారు. సమాజ శ్రేయస్సు కోసం కఠోర దీక్షలు చేస్తున్న ముస్లింల సోదరుల ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో రియాజ్, సయ్యద్, కౌన్సిలర్లు జహీర్, తాహేర్ పాషా, మొయినుద్దీన్, పిల్లు, అయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.