రామన్నపేట, సెప్టెంబర్ 22: కుంభకోణాల కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని, ఆ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు స్కీమ్లను విశ్వసించడం లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన అనుభవం, బీఆర్ఎస్ పదేండ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని హామీలను ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
ఆరు కాదు.. 60 స్కీమ్లు పెట్టినా ప్రజలు కాంగ్రెస్కు ఓటెయ్యరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు కర్ణాటకలో ఉన్నాయా? రైతు రుణ మాఫీ చేశారా? రూ.4 వేల పింఛన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు పరాభవం తప్పదన్నారు. ఎవరేమన్నా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొన్నారు.