చండూరు, ఆగస్టు 19: విద్యుత్తు సంస్థలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనమేంటని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్తు రంగం ఉమ్మడి జాబితాలోనిదని, విద్యుత్తు సంస్థలపై నిర్ణయం తీసుకొనే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. బహిరంగ విపణిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్తు కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై మంత్రి మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు విధించాల్సి వస్తే అందుకు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలపై ఇప్పటికే రాష్ట్ర పభుత్వం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు పొందిందని, అయినా తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన ధ్వజమెత్తారు.