నీలగిరి, అక్టోబర్ 6: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, విపక్షాల గొం తు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం సీపీఎం, సీపీఐ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు పన్నుతున్నదని దుయ్యబట్టారు. మోదీ సర్కారు తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ర్టాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతున్నదని మండిపడ్డారు. బీజేపీని నిలువరించే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే ఉన్నదని ధీమా వ్యక్తంచేశారు.
మునుగోడు ఉప ఎన్నిక వేదికగా వామపక్షాలతో కలిసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ బలహీన పడిందని, బీజేపీని బలంగా వ్యతిరేకించే శక్తులను కలుపుకోవడం లో భాగంగా వామపక్షాలతో కలిసి పోరాడాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, ఎండీ జహంగీర్, సత్యం, శ్రీరాములు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ఆపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. గురువారం ఆయ న సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ప్లాంట్ నిర్మాణ పనులు మొద లు పెట్టినట్టు తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు ఏకపక్షంగా ఉన్నదని, ఎన్జీటీ తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగేలా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వేల కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపా రు. ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదా ద్రి పవర్ ప్లాంట్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. గతంలో ఇదే సంస్థ కేసు వేస్తే ఎన్జీటీ కొట్టివేసిన విషయాన్ని గుర్తుచేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలని వచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గడువులోగా ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.