సూర్యాపేట, జూలై 15(నమస్తే తెలంగాణ): దొంగే దొంగ అన్న చందంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ది ఎప్పుడూ తొండి పంచాయితేనన్నారు. సీఎం కేసీఆర్తో జరిపిన చర్చ ల పురోగతి ఏంటి..?, చర్చలను ఎందుకు ఆపాల్సి వచ్చింది..?, కోర్టు ఉత్తర్వులను, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏదో అన్యాయం చేస్తుందని, కేంద్రం సహకరిస్తలేదని సుప్రీం కోర్టుకు వెళ్లడం ఆకతాయితనం కాకుంటే మరేంటని మంత్రి నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో తొలుత సుప్రీంకోర్టు తలుపు తట్టిందే తామేనని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు అన్యాయం చేయడంలో నాటి చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి అడుగు జాడల్లోనే నేడు జగన్ పయనిస్తున్నాడని విమర్శించారు. ఇక్కడున్నది కేసీఆర్ అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులతో ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టింది ఎవరు..?, నాగార్జునసాగర్ విషయంలో ఎడమ కాలువకు అన్యాయం చేసిందెవరు..?, అసలు నాగార్జునసాగర్ నీటి విడుదలకు ఆపరేషన్ రూల్స్ ఎందుకు పెట్టలేదని అడిగారు. ఇన్ని అన్యాయాలు జరిగినందునే పాలమూరు జిల్లాలో 15 లక్షల మంది వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు. కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుండగా వాటిని పరిశీలించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి కోర్టులను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఏపీ చేస్తున్నదని విమర్శించారు. ఏపీ తీసుకొచ్చిన జీవో 203నే ఈ సమస్యకు కారణమని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.