సూర్యాపేట : ప్రజలకు బాండ్ పేపర్లు రాసిస్తూ మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల కమిషన్కి బాండ్ రాసివ్వాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy )సవాల్ విసిరారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ 6 గ్యారంటీల(Six Guarantees) పై నమ్మకంలేక 42 పేజీల గ్యారంటీని తెచ్చారనీ ఏద్దేవా చేశారు. దాన్ని కూడా ప్రజలు నమ్మడంలేదని బాండ్ పేపర్లు రాసిస్తూ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని రద్దు చేయమని బాండ్ ఇవ్వాలి అని సవాల్ విసిరారు.
ఇలాంటి బాండ్లు కర్ణాటకలో కూడా రాసిచ్చి పత్తాలేకుండా పోయి మొహం చాటేశారని విమర్శించారు. హామీలు అమలు చేయమని కర్ణాటకలో రైతులు వెంటబడితే పారిపోయారన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణాలో సైతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్యారంటీ బాండ్ రాసివ్వమని ప్రజలు అడగడంలేదు. కేసీఆర్ లాంటి నమ్మకమైన వ్యక్తి చెబితే చాలు అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లాగా మాది కాగితాల గ్యారంటీ కాదు కేసీఆర్ నోటి మాటే గ్యారంటీ అన్నారు. నోటి మాట గ్యారంటీ లేక కాగితాల గ్యారంటీ ఇస్తున్నా ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించరని అన్నారు.