సూర్యాపేట : బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్దిపొందాలన్నది బిజెపి వ్యూహంలో భాగంగా కనిపిస్తుందని ఆరోపించారు. గడిచిన లోకసభ ఎన్నికల్లో పుల్వామా ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు. నిజానికి పుల్వామా ఉదంతం బీజేపీ సృష్టిగా ఆయన చెప్పారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు.
సంఘ్ పరివార్ క్రియేటివిటీలో భాగమే పుల్వామా దాడులుగా ఆయాన అభివర్ణించారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కశ్మీర్ లో మరో రచ్చ సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ పై దేశ ప్రజల్లో భ్రమలు తొలగడంతో అడ్డ దారిలో మెజారిటీ ప్రజల్లో పోలరైజేషన్ సృష్టించి అధికారంలోకి రావాలి అన్నది సంఘ్ పరివార్ ఆలోచన అని ఆయన విమర్శించారు. అయితే దేశవ్యాప్తంగా మోదీ పై ప్రజల్లో మోజు తగిందన్నారు.
కర్ణాటక ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. మోదీకి వ్యతిరేకంగా పడిన ఓటు అది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోదీ చేసిన రోడ్ షోలకు జనామోదం లభించలేదన్నారు. ప్రధాని కాకముందు మోదీ ఎక్కడా రోడ్ షో చేసిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ విధానాలు సామాన్యులకే కాకుండా విద్యావంతులకూ నచ్చడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీన పడిందన్నారు. ఎన్నికల హామీలు అమలు పరచడంలో అధికార పార్టీ అప్పుడే విఫలమైందన్న ఆరోపణలు రావడం గర్హణీయమన్నారు.
Manipur incident, BJP, ,Telangana