నల్లగొండ : మునుగోడులో ఓటమిపాలవుతామనే అడ్డదారుల్లో బీజేపీ కుట్రలకు పాల్పడుతూ, చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్లో ఈసీ ఉన్నతాధికారులను కలిసి శుక్రవారం తనకు జారీ చేసిన నోటీసుపై మంత్రి జగదీశ్రెడ్డి వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తాను మాట్లాడినట్లు ఈసీ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని, ఈసీ తనకు జారీ చేసిన నోటీసుపై సమాధానం ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడిన పార్టీ అని చెప్పారు. బావులకాడ దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. బావుల వద్ద మీటర్లు రాకుండా కేసీఆర్ అడ్డుకుంటారన్నారు. గత కొంతకాలంగా తెలంగాణ విద్యుత్ రంగాన్ని దెబ్బతీసే కుట్రలు బీజేపీ చేసిందని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులో ఉన్నది ఉన్నట్లు చెబుతామన్నారు. గుజరాత్లో ఆరు గంటల విద్యుత్ మోటార్లకు మీటర్లు ఉన్నాయని, అక్కడ తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లేవన్నారు.
తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చెబుతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రతోనే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తీసుకొచ్చిందని ప్రజలకు చెబుతామన్నారు. బీజేపీ తప్పుడు ఫిర్యాదులకు, తాము భయపడమని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేకనే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీ పెంచి పోషించిన ఫ్లోరైడ్ రక్కసిని ఎనిమిదేళ్లలోనే తరిమి కొట్టామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మునుగోడులో నాశనమైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టామని, 24 గంటల ఉచిత విద్యుత్తో మునుగోడు వ్యవసాయం అద్భుతంగా మారిందని మంత్రి తెలిపారు. మునుగోడు ప్రజల ఆదాయం, స్థిరాస్తి విలువ పెరిగిందన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ వెంటే నడుస్తారని, బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈసీ నోటీసుకు తాను ఇచ్చిన సమాధానం వారు సంతృప్తి చెందుతారని అనుకుంటానని మంత్రి తెలిపారు.